S. Jaishankar: భారత్‌పై అమెరికా వ్యాఖ్యలు.. జై శంకర్‌ గట్టి కౌంటర్‌

భారత్‌, అమెరికా మధ్య సాగిన చర్చల్లో మానవ హక్కుల అంశం ప్రస్తావనకు రాలేదని భారత విదేశాంగశాఖ మంత్రి జై శంకర్‌ తెలిపారు.  ఈ సందర్భంగా భారత్‌పై అమెరికా చేసిన వ్యాఖ్యలపై  జైశంకర్‌ తీవ్రంగా స్పందించారు. అమెరికా, భారత్‌ మధ్య జరిగిన 2+2 స్థాయి సమావేశంలో మానవ హక్కుల అంశం చర్చించాల్సిన విషయం కాదని అన్నారు. అయితే చర్చ జరిగినప్పుడల్లా వాటి గురించి మాట్లాడేందుకు తాము వెనకాడబోమని, తప్పకుండా మాట్లాడతామని స్పష్టం చేశారు. 

‘ప్రతి ఒక్కరికి భారత్‌పై ఒక అభిప్రాయాన్ని కలిగి ఉండేందుకు అర్హులు. అలాగే మాకు కూడా వారిపై అభిప్రాయాలు ఉంటాయి. అమెరికాతో సహా ఇతర దేశాల మానవ హక్కుల పరిస్థితిపై కూడా మాకు అభిప్రాయాలు ఉంటాయి. ఈ విషయంపై చర్చించాల్సిన అవసరం వచ్చినప్పుడు తప్పకుండా మా అభిప్రాయాలు చెబుతాం’ అని గట్టి కౌంటర్‌ ఇచ్చారు.